చెన్నై : తమిళనాడులో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా టీవీకే ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చవకబారు ప్రకటనలు ఎవరు చేస్తున్నారో వారికి తాను సూటిగా చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు. టీవీకే పార్టీ ఏ ఒక్కరికో గులాం కాబోదని, ఇంకెవ్వరికీ సలాం కొట్టదన్నారు విజయ్. తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలో ఉంటుందని ప్రకటించారు. ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. ఆ అవసరం తమకు లేనే లేదని అన్నారు. రాష్ట్రంలో టీవీకేను ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని, ఇక ఎన్నికలు జరగడమే ఆలస్యమన్నారు.
జనం ఇచ్చే తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు విజయ్. ఆయా పార్టీల నేతలు చేసే ప్రకటనలు చూసి పార్టీకి చెందిన నేతలు, క్యాడర్ ఎవరూ నమ్మవద్దని కోరారు. ఆయన ప్రధానంగా ఎన్డీయే గురించి ఇవాళ ప్రస్తావించారు. ఆ అలయన్స్ లో చేరాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ప్రత్యేకించి ఆయన బీజేపీ గురించి కామెంట్స్ చేయడం కలకలం రేపింది. బీజేపీ మా సిద్ధాంతపరమైన శత్రువని తాము ఇప్పటికే స్పష్టం చేశామన్నారు అని తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ . ఎన్నికల పొత్తు కుదిరే అవకాశం ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆ పార్టీ కేవలం ఊహాగానాలుగా కొట్టిపారేసింది.