సింహాచ‌లం చందనోత్స‌వం ఏర్పాట్ల‌పై ఆరా

స్వామి వారిని ద‌ర్శించుకున్న మంత్రి అనిత

విశాఖపట్నం జిల్లా : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. అనంతరం రాబోయే సింహాచలం చందనోత్సవం, సింహాచలం కల్యాణోత్సవం ఏర్పాట్లపై ఆలయ అధికారులు, అర్చకులతో మంత్రి అనిత సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, గత సంవత్సరం చందనోత్సవానికి సుమారు 1,20,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని తెలిపారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. చందనోత్సవం ఏర్పాట్లపై ఈ నెల చివర్లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సామాన్య భక్తుల దర్శనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు RTGS ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నారని చెప్పారు. RTGS రాష్ట్రానికి గుండె లాంటిదని మంత్రి పేర్కొన్నారు. అధికారులకు ముఖ్యమంత్రి తగిన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వదంతులను నమ్మవద్దని మంత్రి అనిత సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!