దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
తిరుమల : భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం సూచించారు. కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా… ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, FSSAI సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ – ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదే కావడం విశేషమని సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.
ల్యాబ్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ల్యాబ్ లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్ పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించ వచ్చని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కెమికల్, మైక్రో బయాలజీ విభాగాలుగా దీనిని నిర్మించామని, ఇందులో e-tongue, e-nose వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవి ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించగలవని సీఎంకు వివరించారు. 1981లో నీటి పరీక్షల కోసం చిన్నదిగా ప్రారంభమైన ఈ విభాగం, ఇప్పుడు నెలకు 1,000 నుండి 1,500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
