టెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాం

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

హైదరాబాద్ : నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నాం అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. హైద‌రాబాద్ లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై ప్ర‌స్తావించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చారని చెప్పారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చు కోవ‌డం జ‌రిగింద‌ని అన్నారు సీఎం. ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మాణం చేశాం. ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని వెల్ల‌డించారు.

బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను వదిలిపెట్టి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో అడుగు పెట్టిందన్నారు. ఈ క్రెడిట్ త‌న‌కే ద‌క్కింద‌న్నారు. తాను ముందే ఐటీకి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, అది ఇప్పుడు ల‌క్ష‌లాది మందికి ఉపాధి ల‌భిస్తోంద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. మూడు దశాబ్దాలుగా ఆ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నారు. దీనిలో భాగంగానే ఐ.ఎస్.బీని కూడా అందుకునేలా చేశామ‌న్నారు సీఎం. ఓ అద్భుతమైన బిజినెస్ స్కూల్ గా ఐఎస్బీ పేరు తెచ్చుకుంద‌న్నారు. జీనోమ్ వ్యాలీ కూడా ఇలాగే వచ్చిందన్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఫార్మా రంగంలోనూ నెంబర్ వన్ గా ఉన్నాయన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!