హైదరాబాద్ : శ్రీరామ నవమి పండుగ వేళ తీపి కబురు చెప్పింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి . అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన వాటిని అభివృద్ది చేయనుంది. ఈ సందర్బంగా కీలక వివరాలు వెల్లడించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆరు రైల్వే స్టేషన్లు బేగం పేట, హఫీజ్పేట, కరీంనగర్, రామగుండం, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ , వరంగల్ వద్ద అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భారతీయ రైల్వే ఇప్పటి వరకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం 1338 స్టేషన్లను గుర్తించిందన్నారు. వీటిలో 40 స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయని వెల్లడించారు.
ఇక ఈ 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్నగర్, మలక్పేట, మల్కాజిగిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సికింద్రాబాద్, షాద్నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్పురా , జహీరాబాద్ రైల్వే స్టేషన్లు ఉన్నట్లు ప్రకటించారు.
హైటెక్ సిటీ స్టేషన్ వద్ద, ప్లాట్ఫారమ్ షెల్టర్, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, బుకింగ్ కౌంటర్, లిఫ్ట్, ఎస్కలేటర్ , పాదచారుల వంతెన పనులు పూర్తయ్యాయని తెలిపారు అశ్విని వైష్ణవ్. కొత్త స్టేషన్ భవనం, కొత్త ప్రవేశ ద్వారం (పోర్చ్), ప్లాట్ఫారమ్ ఉపరితల మెరుగుదల, సర్క్యులేటింగ్ ఏరియా , పార్కింగ్ పనులు ప్రస్తుతం చేపట్టడం జరిగిందన్నారు.
