హైదరాబాద్ : నాదర్ గుల్ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రూ. 7,000 కోట్ల స్కాం చోటు చేసుకుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కోహినూర్ గ్రూప్ స్పందించింది. ఈ మేరకు వివరణ ఇచ్చింది. నాదర్గుల్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితం తప్పా మరోటి కాదని పేర్కొంది. ఇందులో మంత్రి పొంగులేటికి గానీ, ఆయన కుమారుడు హర్ష రెడ్డికి గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరి నిర్మాణం జరిగిందని పేర్కొంది. 2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివ్ రాజ్ బహదూర్ వారసులు హక్కుదారులుగా గుర్తించ బడ్డారని, ఆ ఏడాది వరకు భూ వివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదని కుండ బద్దలు కొట్టింది కోహినూర్ గ్రూప్.
వ్యవసాయానికి అనుకూలం కాని భూమి కావడం, ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదని తెలిపింది. కేసు విచారణలో ఉన్న సమయంలో మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదని హితవు పలికింది. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం అని పేర్కొంది కోహినూర్ గ్రూప్. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమి హక్కులపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు తెలియ చేసింది.
AQ Square Realtors Pvt Ltd సంస్థ 2021లో మొత్తం స్థలాం చుట్టూ రేకులతో ప్రహరిని ఏర్పాటు చేసిందని, ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్సైట్లోని టైమ్లైన్ ద్వారా తెలుసు కోవచ్చని తెలిపింది. ఈ ప్రహరి పనులు 2022మే నెలలో పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టినవి కావని వెల్లడించింది.. AQ స్క్వేర్ రియల్టర్స్, దాని అనుబంధ సంస్థ క్రిస్టల్ మ్యాన్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్లో 06 డిసెంబర్ 2021 నుంచి 01 మార్చి 2023 వరకు పొంగులేటి హర్ష రెడ్డి అదనపు డైరెక్టర్గా ఉన్నారని తెలిపింది. అనంతరం బోర్డు నుంచి రాజీనామా చేశారని, ఆ వివరాలు MCA రికార్డుల్లో నమోదయ్యాయని పేర్కొంది.. నాదర్గుల్ భూ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ప్రేరేపితంగానే నిరాధార ఆరోపణలు చేస్తూ పొంగులేటికి హర్ష రెడ్డికి ఆపాదిస్తున్నారని ఆరోపించింది.
