ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన ప్రకటన చేసింది. రూల్స్ ను పాటించని సర్వోదయ సహకార బ్యాంకు లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకును మూసివేసే సందర్భంలో ప్రతి డిపాజిట్దారుడు తన డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు బీమా పరిహార మొత్తాన్నిడిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి పొందే హక్కును కలిగి ఉంటారు ఆర్బీఐ స్పష్టం చేసింది జారీ చేసిన ప్రకటనలో. మొత్తం బీమా చేయబడిన డిపాజిట్లలో డీఐసీజీసీ ఇప్పటికే రూ. 26.72 కోట్లు చెల్లించిందని వెల్లడించింది. తగినంత మూలధనం లేకపోవడం, ఆదాయ అవకాశాలు బలహీనంగా ఉండటం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను పాటించక పోవడం వంటి కారణాల వల్ల ముంబైకి చెందిన సర్వోదయ సహకార బ్యాంకు లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది.
ఇదిలా ఉండగా డిపాజిటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది. బ్యాంకును మూసివేసే ప్రక్రియలో 98 శాతం మంది డిపాజిట్దారులు తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని తిరిగి పొందుతారని కేంద్ర బ్యాంకు హామీ ఇచ్చింది. బ్యాంకు సమర్పించిన గణాంకాల ప్రకారం సమగ్ర ఆదేశాలు అమలులోకి వచ్చిన తేదీ నాటికి, సుమారు 98.36 శాతం మంది డిపాజిట్దారులు తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని అర్హతను కలిగి ఉన్నారని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లైసెన్స్ రద్దుకు గల కారణాలను వివరిస్తూ, సర్వోదయ సహకార బ్యాంకు తన ప్రస్తుత ఆర్థిక స్థితిగతులతో డిపాజిట్దారులకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించ లేదని, ఒకవేళ బ్యాంకు తన బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతిస్తే అది ప్రజల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆర్బీఐ తెలిపింది.