శ్రీకాకుళం జిల్లా : పచ్చదనం పరిశుభ్రతకు ఏపీ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం నర్సన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అన్ని గ్రామాల్లో మురుగునీరు వ్యర్ధాలు పొంగిపొర్లకుండా మ్యాజిక్ డ్రైన్లను నిర్మిస్తున్నాం అన్నారు. మన ఇంటితో పాటు మన పరిసరాలు, తిరిగే రహదారులు కూడా పరిశుభ్రంగా ఉండాలన్న సంస్కృతి మనలో పెరగాలని పిలుపునిచ్చారు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు గ్రామాలు, పట్టణాల్లో ఊరి చివర్లో ఎక్కడ చూసినా చెత్త కనిపించేదన్నారు సీఎం. అప్పుడే రహదారులను పరిశుభ్రంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకే స్వచ్ఛపథం పేరిట ఇప్పుడు కార్యక్రమం చేపడుతున్నాం అన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను కూడా మనం వాడకుండా నిషేధం విధించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.
అత్యుత్తమ విధానాలను అనుసరించటం ద్వారా రాష్ట్రంలోని పంచాయితీలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని చెప్పారు. కందులవారి పల్లె, చిత్తూరు జిల్లాకు, కాణిపాకం ఇలా వేర్వేరు పంచాయితీలు అత్యుత్తమ పనితీరు కనపరిచాయని ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేస్తోన్న కృషికి దక్కిన ఫలితంగా ఇది నేను భావిస్తున్నానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే ఈ శాఖలో జాతీయ స్థాయిలో 8 అవార్డులు వచ్చాయని తెలిపారు. మరిన్ని అవార్డులను రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు దక్కించు కోవాలని పిలుపునిచ్చారు సీఎం. ఇవాల్టి నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్రంలో ప్రారంభం అవుతుందన్నారు. నెలరోజు పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడతాం అన్నారు.