అమరావతి : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇదంతా టీం టీడీపీ కృషి ఫలితమేనని పేర్కొన్నారు. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించిందన్నారు నారా లోకేష్. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడు 2026ను అందరి ఆమోదంతో హైబ్రిడ్ విధానంలోకి మార్చాం అన్నారు. తెలుగుదేశం రాజకీయ పాఠశాలలో గురువు చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచు కోవడం మనకు నేర్పారని పేర్కొన్నారు. ఆ నేర్పును ఇంటర్నేషనల్ క్రైసిస్లో కూడా ఎవరూ ఊహించని విధంగా హైబ్రిడ్ మహానాడును ఒక అవకాశంగా తీసుకుని విజయవంతం చేశామని చెప్పారు.
గతంలో మాదిరి ఒకచోట జరిగే మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ కుటుంబ సభ్యులు తరలి వచ్చేవారు. తెలుగుదేశం- నా బాధ్యత అంటూ ఇప్పుడు ప్రతీ పల్లె, ప్రతీ ఇల్లూ మహానాడుకు వేదికైంది. పసుపు జెండాలతో రెపరెపలాడింది. కార్యకర్తలే అధినేతలై, నేతలే మార్గదర్శులై రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడు 2026ను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేశారని ప్రశంసలు కురిపించారు. స్త్రీ శక్తి థీమ్కు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి అందరి ఆమోదం లభించడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన మరో గొప్ప విజయం అన్నారు. కార్యకర్తలే అధినేత నినాదాన్ని జాతీయ అధినేత అమలు చేసిన ఈ మహానాడు చరిత్రలో నిలిచి పోతుందన్నారు.
