పల్నాడు జిల్లా : పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం లోని ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు క్యాంటీన్కు వచ్చిన పేదలు, కార్మికులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. లబ్దిదారులతో ముచ్చటిస్తూ అన్న క్యాంటీన్లోనే సీఎం ఆహారాన్ని తీసుకున్నారు.
అన్న క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం రుచి, శుభ్రత, నాణ్యతల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎం మాట్లాడుతూ కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి అని నేను నమ్ముతాను. అందుకే పేదవాడి ఆకలికి తీర్చడానికి ప్రజాప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చిందన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా రాజకీయం అని ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారని అన్నారు. నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు అజరామరం . ఆకలి అన్న వాళ్లకు కాదనకుండా అన్నం పెట్టడం మన సంస్కృతిలోనే ఉందన్నారు సీఎం. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతంలోనే ఉందన్నారు. నాటి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పారు. 2024లో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఇవాల్టి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగింది. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని సీఎం స్పష్టం చేశారు.
