చెన్నై : తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు తళపతి విజయ్ పై కామెంట్స్ చేసేందుకు తనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయ్ తో ఎన్డీఏ పొత్తు ఉంటుందా అన్న దానిపై తాను వ్యాఖ్యానించడం సరి కాదని అన్నారు. ఇది తన పరిధిలో లేదన్నారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనంటూ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో అధికార పార్టీ ఓటమిని నిర్ధారించడానికి డీఎంకే వ్యతిరేక ఓట్లన్నింటినీ ఏకీకృతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తళపతి విజయ్ గొప్ప నటుడని అంగీకరించారు.
ఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల సందర్భంగా అన్నా మలై విలేకరులతో మాట్లాడారు. విజయ్-బీజేపీ పొత్తు ఎన్డిఎను బలోపేతం చేస్తుందా అని మీడియా పదేపదే అడిగినప్పుడు నో కామెంట్స్ అంటూ దాట వేశారు కె.అన్నామలై. ఇది వ్యక్తిగత భావనల గురించి కాదు. డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ ఏకీకృతం అయితేనే డీఎంకేను ఓడించడానికి అది ఉత్తమ మార్గం అని అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకుడు తమిళనాడు ఎన్నికల దృశ్యాన్ని డీఎంకే నేతృత్వంలోని కూటమి, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డిఎ, తమిళగ వెట్రి కజగం (టీవీకే), 8-9 శాతం ఓట్ల వాటా ఉన్న నామ్ తమిళర్ కట్చి (ఎన్టికె) అధినేత సీమాన్ పార్టీతో కూడిన నాలుగు కోణాల పోరుగా పేర్కొన్నారు కె అన్నామలై.
