అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఉండడం పట్ల ధన్యవాదాలు తెలిపారు సభ సాక్షిగా. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా, ఈ రంగంలో 15 శాతం వార్షిక వృద్ధిని సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించినట్లు తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన” పథకం క్రింద, 2025-26లో రెండవ విడత వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించామన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్నామని తెలిపారు అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వంలో రైతుకు ఉన్న చేదు అనుభవాలను తొలగించి, 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశామన్నారు.
11.02.2026 నాటికి 10,571 కోట్ల రూపాయలను 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అందులో 55 శాతం డబ్బులు 8 గంటలలోపు, 38 శాతం డబ్బులు 8 నుంచి 24 గంటలలో జమ చేసిన ఘనత తమదేనని అన్నారు. భూసారాన్ని అంచనా వేయడానికి ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశామన్నారు.1,250 మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలను ఉచితంగా సరఫరా చేశామని తెలిపారు. “పొలం పిలుస్తోంది” కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ రైతులకు చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం రాయితీతో 136.62 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తున్నామన్నారు. 80 శాతం రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1,130 కిసాన్ డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. A.P.A.I.M.S.2.O యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 2026-27 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు మొత్తం 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించామని తెలిపారు.
