సమర్థవంతంగా పని చేస్తేనే కలెక్టర్లుగా కొనసాగిస్తాం
జిల్లా కలెక్టర్లకు క్లాసు పీకిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని, ఆ విషయం గుర్తించి పనితీరుపై ఫోకస్ పెట్టాలన్నారు సీఎం. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించక పోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు అని అన్నారు.కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని ఆ విషయం మరిచి పోవద్దని సూచించారు. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయాలని స్పష్టం చేశారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని అన్నారు సీఎం. గ్రామాల వారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయని, ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని అన్నారు. ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు . పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.
