HD Kumara Swamy : ఓట్ల కోసమే ముస్లింల జపం
మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి
HD Kumara Swamy : కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్ జరిగేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆయా పార్టీలు మాటల యుద్దానికి తెర లేపాయి. సోమవారం జేడీఎస్ చీఫ్ , మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి సీరియస్ కామెంట్స్ చేశారు.
ఆయన జాతీయ పార్టీలను ఏకి పారేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని ఆరోపించారు. ఇక భారతీయ జనతా పార్టీ హిందూ మతం పేరుతో ఓట్లు కొల్లగొట్టేందుకు విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ మండిపడ్డారు. ఇరు పార్టీలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మెరుగైన పాలనను జేడీఎస్ అందిస్తుందని నమ్మకంతో ఉన్నారని చెప్పారు. తాము ఎవరిని ఓటు బ్యాంకుగా చూడలేదని స్పష్టం చేశారు కుమార స్వామి(HD Kumara Swamy). కేవలం సంక్షేమమే పరమావధిగా పని చేశానని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సరిగా నడిపించలేదన్న అపవాదు తనపై వేశారంటూ ఆవేదన చెందారు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చిన ఘనత జేడీఎస్ దేనని మరోసారి కుండ బద్దలు కొట్టారు.
రెండు జాతీయ పార్టీలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు మాజీ సీఎం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు బిల్లవ అభివృద్ది కార్పొరేషన్ ను ప్రకటించి సామాజికవర్గ ఓట్లను దృష్టిలో పెట్టుకుని చేసిందన్నారు.
Also Read : డాన్ విడుదలపై కోర్టు నోటీసు
