హైదరాబాద్ : పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో హైడ్రా చొరవను కొనియాడారు. మరీ ముఖ్యంగా నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా ఎంతో కృషి చేస్తోందన్నారు. చెరువుతో పాటు.. ఆ పరిసర ప్రాంతాల రూపురేఖలు మారి పోతున్నాయన్నారు. వరద నివారణతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి, భూగర్భ జలాల పరిరక్షణకు చెరువుల ప్రాధాన్యతను గుర్తించే వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పి. మహేందర్ రెడ్డితో కలిసి ఐటీ మంత్రి ఉప్పల్ నల్లచెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువును ఎలా అభివృద్ధి చేస్తున్నారు.. ఏలా తీర్చిదిద్దుతున్నారు అనే విషయాలను అక్కడ చెరువు పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ యజమాని మహమ్మద్ యూనస్ను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనులకు సంబంధించిన 3డీ నమూనాలను మంత్రి పరిశీలించారు.
ఉప్పల్ నల్లచెరువు ఫ్రంట్ ఎలివేషన్ బాగుండాలని మంత్రిసూచించారు. వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఈ చెరువుంది . దాదాపు కిలోమీటరు పొడవునా చెరువు విస్తరించి ఉంది. రోడ్డు పొడవునా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. చెరువు చుట్టూ 2 కిలోమీటర్లకు పైగా వాకింగ్ ట్రాక్ వస్తుందని.., చిన్న పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, చెరువు చుట్టూ సీటింగ్ సౌకర్యం, పచ్చిక బైళ్లు, పార్కులు, అన్ని వయసుల వారికి వ్యాయాయ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని అక్కడ పనులు చేపడుతున్న వారు మంత్రికి తెలిపారు. మురుగు నీరు కలవకుండా డైవర్ట్ కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఆక్రమణలతో 55 ఎకరాలకు కుంచించుకు పోయిన చెరువును 69 ఎకరాలకు విస్తరించామని.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే పలుమార్లు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించారన్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో హైడ్రా అధికారుల చొరవ చెరువు విస్తరణకు దోహద పడిందని తెలిపారు. చెరువులో 3 మీటర్ల మేర పూడికను తొలగించామని . ప్రధాన ద్వారం చెరువుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
