హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వల్లనేనని అన్నారు. దానిని ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో తెలంగాణ భవన్ లో భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు కేక్ కట్ చేసి తన బావ కేటీఆర్ కు తినిపించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మీద, తెలంగాణ మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు కేటీఆర్. ఇలాంటి చిల్లర గాళ్ల మాటలు మాట్లాడే వారికి చరిత్ర తెలియదని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపేయాలని అనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదన్నారు. లోకం ఉన్నంత వరకు తెలంగాణ ఉంటుందని, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు .
సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని పోయిన జాతి ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు.
