మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాష్ట్ర సమితి పార్టీని, మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శించేందుకు, ఏకిపారేసేందుకు తాము అవసరం లేదని అన్నారు . తన కూతురు కవిత ఒక్కరు చాలని పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని మంత్రి అన్నారు . బుదవారం మంత్రి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర శాసన సభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ది పనులలో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు. తాము పట్టించుకోమని పేర్కొన్నారు. ఆ పార్టీని తాము ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు . అయితే పలుసార్లు ఎందుకు విమర్శించాలని, ఏం చేశారని వారిపై ఆరోపణలు చేయాలని తన కూతురు ఒక్కతే వారికి సరైన పోటీ అంటూ పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని చోట్లా గెలిస్తే, మరింత ఎక్కువ బలం తో పనిచేసే అవకాశం లభిస్తుందని కోమటిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయని పేర్కొంటూ, రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ 10 శాతానికి మించి గెలవదని ఆయన అన్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ 40 శాతం సీట్లు గెలుస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో తన బలాన్ని చూపించాలని మంత్రి ఆయనకు సవాల్ విసిరారు.
