నల్లగొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మున్సిపల్ , మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజయాన్ని చేకూర్చి పెట్టారని అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ పట్టణంలో ఆకస్మిక తనికీ చేశారు. కమిషనర్ తో కలిసి పట్టణంలో పరిశీలించారు. ప్రజల సహకారంతో నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుం చే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రకాశం బజార్, లతీఫ్ షాప్ గుట్ట తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ప్రకాశం బజార్కు ప్రతిరోజూ సుమారు 10,000 మంది ప్రజలు వస్తుంటారని అన్నారు మంత్రి. పెరుగుతున్న జనాభా, వ్యాపారాలకు అనుగుణంగా ఇక్కడి రహదారులు లేక పోవడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఫుట్పాత్లపై ఉన్న పూలు, పండ్లు, చిన్న వ్యాపారాలను పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలానికి తరలించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఏ ఒక్క చిన్న వ్యాపారికి అన్యాయం జరగకుండా, వారి ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భూగర్భ విద్యుత్ వ్యవస్థ (Underground Cabling) ఏర్పాటు చేస్తామన్నారు.
పటిష్టమైన సిసి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
