అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు విడతలుగా పల్లె పండుగను నిర్వహించడం జరిగిందని చెప్పారు. తొలి విడత పల్లె పండుగ కింద రూ. 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ. 5,700 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చే కార్యక్రమం ‘అడవి తల్లి బాట’ పథకం కింద రూ.1005 కోట్లను వెచ్చించాం అన్నారు. దీంతోపాటు సాస్కీ నిధులు రూ.2,123 వేల కోట్లతో నియోజక వర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నాం అన్నారు. మొత్తంగా రూ.11,328 కోట్లతో చేస్తున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.28 వేల కోట్ల పనులకు అనుమతులు లభిస్తే, దానిలో రూ.10 వేల కోట్ల పనులను ప్రారంభించామని వెల్లడించారు.
ఇక అటవీ శాఖ పరిధిలో రూ.200 కోట్లతో నగర వనాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఇంకా అనేక పనులను పారదర్శకంగా క్రమపద్ధతిలో, ప్రాధాన్యతలను అనసరించి చేస్తున్నాం అన్నారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమపద్ధతిలో చేస్తున్నామని, మొదలుపెట్టిన పనులను ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో పనులను పూర్తి చేయడం అవసరం అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రభుత్వం అప్పగించిన పనిని నిబద్ధతతో నిజాయతీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
