హైదరాబాద్ : ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ పార్కులను కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగిపేటను సర్కిల్ ఆల్మాస్గూడ 57వ డివిజన్ శ్రీ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2260 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. ఈ పార్కులో ఇప్పటికే 6 ఇళ్లు వచ్చేయగా మిగిలిన స్థలాన్ని అయినా కాపాడాలని నివాసితులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని విజయవిహార్ ఎన్క్లేవ్ లే ఔట్లో రహదారులతో పాటు వరద కాలువ నిర్మాణానికి 20 ఫీట్ల మేర ఖాళీ స్థలాన్ని ఉంచితే , పక్కనే ఉన్న భూ యజమానులు ఆ 20 ఫీట్ల రహదారిని కబ్జా చేశారని తెలిపారు. మా లే ఔట్ ప్రకారం ఖాళీ స్థలాన్ని తమకు అందజేయాలని కోరారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారంలో 432 ప్లాట్లతో శ్రీ సాయి రెడ్డీ లేఔట్ను వేశారు. ఈ లే ఔట్కు చేరువలో మూత్కుల్ కుంట ఉంది. అలుగు మీద అక్రమ కట్టడాలు రావడంతో చెరువులోని నీరు బయటకు వెళ్లడానికి వీలు లేని పరిస్థితి నెలకొందన్నారు ఫిర్యాదుదారులు. ఈ లే ఔట్లో 90 ప్లాట్ల వరకూ నీట మునుగుతున్నాయని వాపోయారు. గతంలో ఈ చెరువు 5.22 ఎకరాలుగా ఉండేదని, మురుగు నీరు కూడా చేరడం.. చెరువు నుంచి కిందకు నీరు వెళ్లే అలుగు ఆక్రమణలకు గురి కావడంతో నీటి నిలువలు పెరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ గందంగూడలోని గ్రీన్ పార్క్స్ కాలనీలో హైదర్షాకోట్ – బైరాగి గూడ ప్రధాన రహదారి 30 ఫీట్లుండగా.. పక్కనే స్థలం ఉన్న వారు మొత్తం 12 అడుగులకు పైగా ఆక్రమించేయడంతో ఆ రోడ్డు కుంచించుకు పోయిందని ఆవేదన చెందారు. దీంతో తమకు దారి లేకుండా పోయిందని పేర్కొన్నారు. మణికొండలోని సచివాలయ ఉద్యోగుల కాలనీ లేఔట్లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురయ్యాయని వైఎస్ ఆర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 2236 గజాల స్థలంతో పాటు.. 1163 గజాల స్థలం కబ్జాలకు గురి కాకుండా కాపాడాలని కోరారు.
