ఢిల్లీ : ఆప్ రాజ్యసభ ఉప నాయకుడిగా, ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా రాఘవ్ చద్దాను తొలగించడంపై మాజీ సీఎం ఆతిషి స్పందించారు. ఈ రోజు మన దేశం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతోందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. ప్రతిపక్షమంతా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. టీఎంసీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, కానీ ఎంపీగా ఉన్న రాఘవ్ చద్దా దానిపై సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సభ నుండి బయటకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎల్పీజీ సంక్షోభం ప్రతి సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. దానిపై మాట్లాడమని పార్టీ రాఘవ్ చద్దాను కోరిందని తెలిపారు ఆతిషి.
అయితే దానిపై ఆయన మాట్లాడటానికి నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోని చాలా మంది నాయకులు భయపడి బీజేపీలో చేరారని, తర్వాతి వంతు రాఘవ్ చద్దాదే కావచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొంత కాలంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంచలనంగా మారారు. తను సామాన్యులు, ప్రజలు, పేదల గురించి పదే పదే సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆయన నిప్పులు చెరిగారు. ఇప్పుడు నేషనల్ హీరోగా మారి పోయాడు రాఘవ్ చద్దా. కెరీర్ పరంగా ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. లక్షల జీతం వదులుకుని ప్రజల కోసం ఆయన ఆప్ లో చేరారు. పార్టీ బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
