హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగ సందర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ ఉన్న వారంతా జర్నీ చేస్తారు. ఇప్పటికే ఆర్టీసీ సంస్థ భారీ ఎత్తున బస్సులను ఏర్పాటు చేసింది. అయితే స్పెషల్ బస్సుల పేరుతో పెద్ద ఎత్తున ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ . ఇదే సమయంలో ఏపీ ఎస్ఆర్టీసీ మాత్రం సంచలన ప్రకటన చేసింది. పండుగ సందర్భంగా ఏకంగా 8 వేల 400కు పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ఎండీ ద్వారకా తిరుమలరావు.
ఈ తరుణంలో రైళ్లు కూడా కిట కిట లాడుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ విజయవాడ రహదారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ ఏర్పడింది. గంటల తరబడి వేచి ఉన్నారు వాహనదారులు. ఈ తరుణంలో ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్ – సిర్పూర్ కగజ్నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపిస్తామని తెలిపింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా స్పెషల్ పేరుతో తమను నిట్ట నిలువునా దోపిడీ చేస్తున్నారంటూ ప్రయాణీకులు లబోదిబోమంటున్నారు. ఇటు రైల్వే శాఖను మరో వైపు ఆర్టీసీని ఏకి పారేస్తున్నారు.
