న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. సత్యం బతికే ఉందని తేలి పోయింది. ఒకటా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇదిలా ఉండగా సినీ నటి ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొన్నిఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. 2002 ఫిబ్రవరి 23న తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి కొద్ది రోజులకు కోలుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించిందంటూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు . ఈ కేసులో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా.. హైకోర్టు దాన్ని రెండేళ్లకు కుదించింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సిద్ధార్డ్ రెడ్డి కూడా దానికి కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు పరిశీలించిన న్యాయస్థానం గతేడాది నవంబర్ లో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ సిద్ధార్డ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. తను నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
