అమరావతి : ఏపీలోని లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కర్లపూడి – లేమల్లె లో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు.గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటికే కాంపిటెంట్ అధారిటీ. ల్యాండ్ పూలింగ్ కొరకు గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఏం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ కు ధన్యవాదాలు తెలిపారు అన్నదాతలు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు మొత్తం 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆగమాగం చేసిందని ఆరోపించారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేసినా తాము వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆరు నూరైనా సరే ఏపీకి రాజధాని అమరావతియేనని ప్రకటించారు నారాయణ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో ఇప్పటి వరకు ప్రజల చెవుల్లో జగన్ రెడ్డి పూలు పెట్టాడని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డిని జనం నమ్మే స్థితిలో లేరన్నారు మంత్రి. ఇకనైనా తను మారితే మంచిదని, లేక పోతే రాబోయే ఎన్నికల్లో తనను, పార్టీని అడ్రస్ లేకుండా చేయడం ఖాయమన్నారు నారాయణ.
