హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవరైనా సరే చైనాకు చెందిన మాంజాలను వాడితే, లేదా ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja అనే హ్యాష్టాగ్తో వరుస ట్వీట్ల ద్వారా సజ్జనార్ చేసిన వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. మిత్రమా, పతంగులు ఎగరేయండి… కానీ ఎవరి మెడను కోయకండి అంటూ సూచించారు. ఇది సినిమా డైలాగ్ కాదు. సంక్రాంతికి ముందు ‘ఎక్స్’లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పదునైన, తెలివైన హెచ్చరిక. ప్రాణాంతకమైన చైనీస్ మాంజా వాడకానికి వ్యతిరేకంగా ప్రజలను ముందస్తు జాగ్రత్తలు సూచించారు.
సాధారణ పోలీసు ప్రకటనలకు భిన్నంగా సజ్జనార్ విలక్షణమైన హైదరాబాదీ శైలిని అవలంబించారు, దక్కనీ ఉర్దూతో పాటు తెలంగాణ మాండలికాన్ని మిళితం చేసి ఒక తీవ్రమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పతంగులు ఎగరేయడం మంచిదే, కానీ అది ఎవరి ప్రాణానికీ ముప్పు తేకూడదని స్పష్టం చేశారు. చైనా కా సామాన్… చలే తో చాంద్ తక్, వర్నా శామ్ తక్ అని చమత్కరించిన తర్వాత, ఆయన ఒక సూటి హెచ్చరిక కూడా జారీ చేశారు: చైనీస్ మాంజా ఉపయోగించిన వారు “సీధా అందర్” (నేరుగా జైలుకు) వెళ్తారని అన్నారు. పోలీసు హెచ్చరికలు సాధారణంగా చట్ట పరమైన భాష , చట్టంలోని సెక్షన్ల రూపంలో ఉంటాయి. కానీ ఇవాళ ఆయన చేసిన ప్రకటన ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.
