మహాశక్తి పథకం పేరుతో మహిళల దగా : షర్మిలా రెడ్డి
కూటమి సర్కార్ బక్వాస్ అంటూ షాకింగ్ కామెంట్స్
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని , రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతీ లేకుండా పోయిందన్నారు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై సర్కార్ కు నిబద్దత లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ మహిళలు రెడీగా ఉండమని మరొకరు మాట్లాడారని ఇప్పటి వరకు ఒక్క మహిళకు ఈ పథకాన్ని వర్తింప చేసిన దాఖలాలు లేవన్నారు. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు చేసింది ఘరానా మోసమే తప్పా మరోటి కాదన్నారు షర్మిలా రెడ్డి.
నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తాం అన్నారని ధ్వజమెత్తారు. అంతే కాదు అరచేతిలో స్వర్గం చూపించారని చివరకు దాని ఊసెత్తడం లేదన్నారు. 15 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నారని దానికి కూడా దిక్కు లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు తప్పా మరోటి కాదన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ అని అది కూడా అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా భరోసా ఇచ్చే హామీ ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ వచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
