న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్రయాణీకులకు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం తమ గగన తలాన్ని మూసి వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ప్రయాణం చేసే, ముందస్తు బుకింగ్ చేసుకున్న ట్రావెలర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గురువారం అధికారికంగా వెల్లడించింది. గగన తలం మూసివేత కారణంగా పలు విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. అమెరికా, యూరప్ లకు వెళ్లేందుకు మార్గం మూసి వేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది ఎయిర్ ఇండియా. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా రెండు దేశాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుందనే భయాలు నెలకొన్నాయి.
ఇరానియన్ ఎయిర్స్పేస్ మూసివేత కారణంగా ఎయిర్ ఇండియా యుఎస్కు కనీసం మూడు విమానాలను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించాలని నిర్ణయించామని పేర్కొంది . సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇరాన్లో ఉద్భవిస్తున్న పరిస్థితి, దాని వైమానిక ప్రాంతం మూసి వేయడం వల్ల ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఇలా చేయాల్సి వచ్చిందని, ప్రయాణీకులు సహకరించాలని కోరింది ఎయిర్ ఇండియా. ప్రస్తుతం రూటింగ్ సాధ్యం కాని కొన్ని ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేశామని తెలిపింది. ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అయితే యుఎస్ కు వెళ్లాలంటే విధిగా విమానాలన్నీ ఇరాన్ గగన తలాన్ని వాడుకుంటోంది.
