చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటుడు తళపతి విజయ్. తను నటించిన తాజా చిత్రం జన నాయగన్. జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అడ్డుపుల్ల వేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీకి అడుగడుగునా అడ్డుంకులు ఏర్పడడంతో నిర్మాతలు భారీ నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు జన నాయగన్ రిలీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని, మద్రాస్ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన పిల్ పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది ధర్మాసనం. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. తమ పరిధిలో లేదంటూ పేర్కొంది.
అయితే జన నాయగన్ మూవీ విడుదలపై ఏదో ఒక నిర్ణయం ఈనెల 20వ తేదీ లోపు తీసుకోవాలని ఆదేశించింది మద్రాస్ హైకోర్టును. దీంతో ఆరోజు వరకు విజయ్ వేచి చూడాల్సిందే. మరో వైపు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని పెద్ద ఎత్తున ప్రకటన కూడా చేశారు మూవీ మేకర్స్. సింగపూర్ లో అట్టహాసంగా ఆడియో లాంచ్ కూడా చేశారు. ఇప్పటికే జన నాయగన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నారు విజయ్. ఇదే క్రమంలో తనను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు కొన్ని శక్తులు కావాలని తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. తను టీవీకే పార్టీని ఏర్పాటు చేశాడు.
