బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) సంచలన ప్రకటన చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్బంగా బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్లో జరగనున్న ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనడం లేదని ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం భద్రతా కారణాలు లోపించడం వల్లనేనని పేర్కొన్నారు. భారత్ పర్యటన తమ ఆటగాళ్లకు, జర్నలిస్టులకు ఏమాత్రం క్షేమకరం కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీంతో తమ బోర్డు కీలక సమావేశం నిర్వహించిందని, ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా క్రికెట్ బోర్డు మీడియా కమిటీ చైర్మన్ అమ్జద్ హుస్సేన్ తెలిపారు.
అయితే తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరినప్పటికీ వారు అంగీకరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భద్రతా దృష్ట్యా భారత్లో ఆడటం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు . ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, బంగ్లాదేశ్ మ్యాచ్లు భారతదేశంలోనే ఆడతారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కుండ బద్దలు కొట్టింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్, ప్రస్తుతం భారతదేశంలో ఆడటం తమకు సురక్షితం కాదని పేర్కొంటూ, శ్రీలంకలో ఆడాలని కోరారు. జరిగిన అన్ని భద్రతా అంచనాలను, స్వతంత్ర సమీక్షలతో సహా, పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
