రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

శాస‌న స‌భ‌లో మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు స‌మాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామ‌ని చెప్పారు. విద్యుత్ లైన్లు వేసిన తరువాత వాటి కింద ఇళ్ల నిర్మాణంతోనే భద్రతా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అవగాహన లోపం, లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాదంగా మారిన విద్యుత్ లైన్లు గుర్తిస్తే అధికారులకు సమాచారం వెంట‌నే అందించాల‌ని కోరారు.

లైన్లు, స్తంభాల మార్పిడికి సంబంధీకులు దరఖాస్తు చేస్తే లైన్లు మార్చుతామ‌ని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి. విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎంపీ నిధుల ద్వారా లైన్ల మార్పిడి చేపట్టామ‌ని తెలిపారు. ప్రాణాల కంటే ఏదీ విలువైంది కాదని అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించామ‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ఇదిలా ఉండ‌గా ఎక్కువ‌గా రైతులు పామాయిల్ తోటల్లో కోత కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ప్రతీ జిల్లాకు రూ. కోటి మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వకూడద‌ని స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!