తెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదు

ప్ర‌ధాని మోదీకి స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : ప‌శ్చిమాషియాలో నెల‌కొన్న ప్ర‌స్తుత సంక్షోభ‌ సమయంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్‌ను సజావుగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్ర‌ధాన‌మంత్రి మోదీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న పాల్గొని వివ‌రాలు తెలియ చేశారు. .పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాను సమీక్షించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు . హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అధికారిక కమిటీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని, గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ అమ్మకాలను పర్యవేక్షించడానికి , బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి 33 జిల్లాలన్నింటిలో నోడల్ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశామ‌న్నారు సీఎం. ప్రధానమంత్రి దృష్టికి పలు కీలక అంశాలను తీసుకు వచ్చారు.

ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వాణిజ్య గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన సరఫరా చేస్తున్నామ‌న్నారు. ఇంధనాల లభ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ఫిల్లింగ్ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న నిల్వల స్థాయిలను, అలాగే రోజువారీ వినియోగ రేట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితులలో తెలంగాణలో సగటు రోజువారీ పెట్రోల్, డీజిల్ వినియోగం 36,189 కిలోలీటర్లుగా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా, పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, భయాందోళనలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించామ‌న్నారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!