షాకిచ్చిన ముంబై ఇండియన్స్ తలవంచిన పంజాబ్ కింగ్స్
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కొట్టిన దెబ్బకు బౌలర్లు విలవిల
ధర్మశాల : ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. కానీ పోతూ పోతూ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలని కలలు కంటున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆశలపై నీళ్లు చల్లింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది పంజాబ్ . నిర్ణీత 20 ఓవర్లలో 200 రన్స్ చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎవరూ ఊహించని రీతిలో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కు కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. ప్రత్యేకించి ఓపెనర్ రెకెల్టన్ దాడి చేస్తే ఆ తర్వాత రూథర్ ఫర్డ్, వోక్స్ తో కలిసి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దుమ్ము రేపాడు. పంజాబ్ బౌలర్ల భరతం పట్టాడు. చివరి దాకా ఉండి ముంబై ఇండియన్స్ పరువు పోకుండా కాపాడాడు. అన్నీ తానై వ్యవహరించాడు.
సిక్సులు, ఫోర్లతో విరుచుకు పడ్డాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆఖరి ఓవర్ లో 15 రన్స్ కావాల్సి ఉండగా సిక్సర్లతో ముగించారు బ్యాటర్లు.ఇక ఐపీఎల్ సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ ప్రధాన జట్లను ఓడించి ఔరా అనిపించింది. కానీ రెండో సెషన్ వచ్చే సరికల్లా చేతులెత్తేసింది. ప్రతీ మ్యాచ్ లో సత్తా చాటుతూ వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. ఇక తిలక్ వర్మ కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 75 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. ఈ సీజన్ లో ఓ సెంచరీ కూడా ఉంది తనకు. ఇందులో 6 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టులో బౌలర్ శార్దూల్ ఠాకూర్ పంజాబ్ నడ్డి విరిచాడు. 39 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.