పేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం

అమరావతి : రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అమె అన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో చెక్ ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు.

అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని ఆమె అభిప్రాయ పడ్డారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందు తున్నారని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండ కూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుదని వ్యాఖ్యానించిన భువనేశ్వరి….తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!