అమరావతి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులతో సంభాషించారు. పాలనలో టెక్నాలజీని వాడుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను ఏది అనుకున్నానో దానినే ఏపీలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ఇదే సమయంలో బిల్ గేట్స్ కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నారా చంద్రబాబు నాయుడు తనకు పాత స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. ఆనాడు మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఆయన ముందు చూపు తనను ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు బిల్ గేట్స్.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం సీఎం తో కలిసి ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక విధానాలను బిల్ గేట్స్ కు వివరించారు. ముఖ్యంగా డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలను నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి పరిశీలించారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు బిల్ గేట్స్. మహిళా రైతులు ఎంతో ఆత్మీయంగా వండి తీసుకువచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. సాంకేతికతను సామాన్య రైతుకు చేరువ చేయడమే లక్ష్యంగా తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు.
