హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ 2047 విజన్ దేశానికే రోల్ మోడల్ గా మారిందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బయో సదస్సు 2026ను ప్రారంభించి ప్రసంగించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్రూస్ ఎల్. లెవిన్ తో కలిసి హైటెక్స్లో బయో ఆసియా సమ్మిట్ను ప్రారంభించే అదృష్టం నాకు లభించిందన్నారు. హైదరాబాద్ 23 సంవత్సరాలుగా బయో ఆసియాకు ఆతిథ్యం ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉందన్నారు సీఎం. ఇది త్వరలోనే నిజంగా ప్రపంచవ్యాప్త షబయో వరల్డ్” సమ్మిట్గా పరిణామం చెందుతుందని నేను విశ్వసిస్తున్నానని అన్నారు.
హైదరాబాద్ నేడు ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా నిలుస్తోందని చెప్పారు. గత రెండు సంవత్సరాలలోన రూ. 73,000 కోట్లకు పైగా లైఫ్ సైన్సెస్ పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందన్నారు. తాము ఇటీవల దావోస్లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించామని తెలిపారు. “వన్-బయో” చొరవను ప్రారంభించామని, గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేసామని, ప్రముఖ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను ఆహ్వానించడం జరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను , 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. పరిశ్రమ, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు.
తెలంగాణ స్థిరమైన, ఆవిష్కరణ-ఆధారిత పర్యావరణ వ్యవస్థను అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ను వ్యాక్సిన్ రాజధాని నుండి ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మార్చడంలో మాతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
