హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై భగ్గుమన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారు . పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు . ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని, మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని నిలదీశారు.
ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారన్నారు. పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి.. హుందాగా తప్పుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది .ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం అంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
