అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియా లో యుద్దం కొనసాగుతోందని, దీంతో గ్యాస్, ఆయిల్ కొరత ఏర్పడిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, దీనిపై ఆరా తీశారు సీఎం. ఈ మేరకు కీలక సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ గ్యాస్ కోసం ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ప్రధానంగా దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. రాబోయే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
