కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్‌స్ట్రక్షన్స్ కొండ‌ల‌ను త‌వ్వుతోంద‌ని ఆరోపించారు. అనుమ‌తులు లేకుండా త‌వ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు. రేవంత్ అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల సర్కార్ భూమి ధారాదత్తం చేశారంటూ మండిప‌డ్డారు. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా? మంత్రులు, వారి బంధువుల భూకబ్జాలు కనిపించవా అని నిల‌దీశారు. అక్రమ మైనింగ్ నిలిపివేసి, పెనాల్టీతో రికవరీ చేయాల‌ని హరీష్ రావు డిమాండ్ చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీటు తరలిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనులశాఖ మంత్రి వివేక్‌ సహా యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

శని, ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్ల మీదికి వెళ్లే హైడ్రా బుల్డోజర్లకు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా అని నిల‌దీశారు హ‌రీశ్ రావు. రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూమిని తనవారికి పప్పు బెల్లంలా కట్టబెడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీయా అనే అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!