టీటీడీ చైర్మన్ ను వెనకేసుకు వస్తున్న చంద్రబాబు
చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ రెడ్డి డిమాండ్
అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. అత్యంత నిష్ఠతో చేయాల్సి ఉండగా అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆరోపించారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు లేఖ రాశారు.
ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించు కోక పోవడం దారుణమన్నారు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారని మండిపడ్డారు జగన్ రెడ్డి. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని అన్నారు.
