జగిత్యాల జిల్లా : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రాంతం పట్ల చేసిన కామెంట్స్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేని లోటు కనిపించిందన్నారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు ధీటైన సమాధానం చెప్పి ఉండే వాళ్లం అన్నారు హరీశ్ రావు. ఇప్పటికైనా తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ తో ఎందుకు ముడి పెట్టారని ప్రశ్నించారు. 2/3 మెజార్టీ లేదని స్పష్టంగా తెలిసినా రాజకీయం కోసమే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వని కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టిఫిన్ కోసం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్తారంటూ ఎద్దేవా చేశారు. క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో రేవంత్ రెడ్డి చేసే హైబ్రిడ్ పనులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అర్థం అవుతున్నాయో లేదో తెలియడం లేదన్నారు తన్నీరు హరీశ్ రావు. రాహుల్ విధానంతో కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా అని నిలదీశారు.
