KCR Comment : ఫ‌లించ‌ని యాగం అధికారానికి దూరం

గ‌ట్టెక్కించ‌ని స్వాములు..న‌మ్మ‌కాలు

KCR Comment : తెలంగాణ సాధించిన, ఉద్య‌మ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌నంగా మారారు. కాలం క‌లిసి రాక పోతే బ‌ల్లి కూడా పాము గా మారి క‌రుస్తుంద‌ని ఓ సామెత‌. దానికి త‌గ్గ‌ట్టుగా రాను రాను ఇక్క‌డ రాజ‌కీయాల‌లో మార్పులు చోటు చేసుకున్నారు. ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి రావాల‌ని క‌న్న క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిసారి కేసీఆర్ సీఎంగా తీసుకున్న నిర్ణ‌యాలు, ప్ర‌వ‌ర్తించిన తీరు, ప్ర‌తిప‌క్షాల ప‌ట్ల వాడిన భాష చివ‌ర‌కు అస‌హ్యించుకునేలా చేశాయి. ఒక ర‌కంగా కేసీఆర్(KCR) ప‌త‌నం స్టార్ట్ అయ్యింద‌ని అనుకోక త‌ప్ప‌దు. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం ఉద్య‌మ నేత‌గా అక్కున చేర్చుకుంది. ఆద‌రించింది. తెలంగాణ బాపుగా కీర్తించింది. కానీ ఏనాడూ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోలేదు. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్ర‌మే న‌మ్ముకున్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా ఆయ‌న స్వాముల‌ను విశ్వ‌సించారు. వారిని అంద‌లం ఎక్కించారు.

KCR Comment Viral

చివ‌ర‌కు ప్ర‌జ‌లు కోరుకుని త‌మ నాయ‌కుడిగా , సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెడితే ఆ కుర్చీపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామిని కూర్చోబెట్టారు. ఇది రాజ్యాంగ విరుద్దం.పేద‌ల తిరుప‌తిగా భాసిల్లిన యాద‌గిరిగుట్ట‌ను, భ‌ద్ర‌చలం దేవాల‌యాల చ‌రిత్ర‌ను వక్రీక‌రించే విధంగా చిన్న జీయ‌ర్ స్వామి పేర్ల‌ను మార్చేశారు. ఒక దానికి యాదాద్రి అని ఇంకో దానికి భ‌ద్రాద్రి అని పేరు పెట్టారు. ఇక యాదాద్రి వెనుక అంతా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం త‌ప్ప మ‌రోటి ఏమీ లేద‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఎన్నిక‌ల కంటే ముందే త‌న ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున రాజ శ్యామ‌లా యాగాన్ని మ‌రో ఆంధ్రా ప్రాంతంలోని విశాఖ‌కు చెందిన శ్రీ శార‌దా పీఠం పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి స్వామి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టారు. ఆయ‌న‌కు సాగిల‌ప‌డ్డారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, ప్ర‌జ‌లు ఆయురారోగ్యంతో ఉండాల‌ని తాను ఈ యాగాన్ని చేప‌ట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ కేవ‌లం ఈ రాజ శ్యామ‌లా యాగం కేవ‌లం తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు నిర్వ‌హించినట్లు పార్టీకి చెందిన నేత‌లే ప్ర‌క‌టించారు. ఇదంతా ప‌క్క‌న పెడితే ఈ యాగాల నిర్వ‌హ‌ణ‌, స్వామీజీల ఖ‌ర్చంతా తెలంగాణ ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. 80 వేల పుస్త‌కాలు చ‌దివిన కేసీఆర్(KCR) ఏనాడో ప్ర‌జ‌ల నుంచి దూర‌మ‌య్యారు. కేవ‌లం ఆస్తులను కొల్ల‌గొట్ట‌డం, ప్ర‌జా ధనాన్ని లూటీ చేయ‌డం, దోచు కోవడం, దాచు కోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. దీంతో తెలంగాణ ప్ర‌జానీకం గుర్తించింది.. బీఆర్ఎస్ పార్టీని, గులాబీ దండును నేల కేసి కొట్టింది. దీంతో తాను చేప‌ట్టిన రాజ శ్యామ‌లా యాగం బెడిసి కొట్టింది. ఉద్య‌మ నేత‌కు ఈ మాత్రం అర్థంకాక పోవ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ప‌వ‌ర్ లోకి రావాలంటే జ‌నం మ‌ద్ద‌తు కావాలి. కానీ గ‌డీల‌ను నిర్మించుకుని, బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుంటే ఎలా గెలుస్తాన‌ని అనుకున్నారో కేసీఆర్ కే తెలియాలి. మొత్తంగా స్వాముల యాగాలు ఫ‌లించ లేదు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లంటూ చెప్ప‌క‌నే చెప్పారు.

Also Read : Revanth Reddy Comment : గులాబీ దండులో గుబులు

Leave A Reply

Your Email Id will not be published!