అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (PACS) 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో వ-PACS గా మార్పు చెందాయన్నారు. ఇవి డిజిటల్ విధానంలో రోజు వారీ లావాదేవీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు నిధి (AIF)తో PACSలను బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నామని చెప్పారు. 4.37 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 780 గోదాములు నిర్మించడం జరిగిందన్నారు మంత్రి. 2026-27 సంవత్సరానికి సహకార శాఖకు రూ. 209.30 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించినట్లు తెలిపారు.
రైతులకు వ్యవసాయ ఆదాయంతో పాటు, పాడితో అదనపు ఆదాయం చేకూరుతుందని చెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు. మన రాష్ట్రం అపారమైన పశువనరులకు ఆలవాలం అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒంగోలు, పుంగనూరు గోజాతులు, శ్రేష్టమైన నెల్లూరు, మాచెర్ల జాతి గొర్రెలు, ఆశిల్ జాతి కోళ్ళు సైతం రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా 2026-27 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఈ సంవత్సరంలో 3.68 కోట్ల వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు. అలాగే 1.71 కోట్ల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసి పశు సంపద ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపారు. పశువుల పోషణకు 1,826 మెట్రిక్ టన్నుల నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, అలాగే 10,007 మెట్రిక్ టన్నుల పశు దాణాను సరఫరా చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 36,016 గోకులాలు మంజూరు చేసినట్లు తెలిపారు. బహువార్షిక పశుగ్రాసం సాగు పథకం ద్వారా 8,193 ఎకరాలలో పశుగ్రాసాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
