శ్రీలంక : కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కీలకమైన దాయాదుల పోరులో చిట్ట చివరకు భారత కుర్రాళ్లు సత్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో వరుసగా భారత జట్టుకు ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. ముందుగా బరిలోకి దిగిన భారత్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను కోల్పోయింది. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. కానీ ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. చుక్కలు చూపించాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకు పడ్డాడు. షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 175 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది.
అనంతరం మైదానంలోకి దిగిన పాకిస్తాన్ ఏ కోశానా భారత బౌలర్లను ఎదుర్కోలేక పోయింది. మూడు ఓవర్లలోనే మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గ్రూప్ -ఏలో జరిగిన ఈ కీలక పోరు చివరకు ఏకపక్షంగా సాగింది. ఇషాన్ కిషన్ 40 బంతులు ఎదుర్కొని 77 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు , 3 సిక్సులు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 చేశాడు. ఇక పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది మాత్రమే ఆడారు. ఖాన్ 44 రన్స్ చేస్తే అఫ్రిదీ 23 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ 2 , బుమ్రా 2, వరుణ్ , అక్షర్ చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. పాకిస్తాన్ ను కోలుకోలేకుండా చేశారు.
