అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో.
ఇదిలా ఉండగా నీటి పారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడు కోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడంలో మరింత దూకుడు ప్రదర్శించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది.
