తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో మొదటి, అత్యంత ముఖ్యమైన రోజువారీ ఆచారంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉండగా ధనుర్మాసం ముగియడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ వేకువజామున సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు సంతోషానికి లోనయ్యారు. తమిళ క్యాలెండర్ ప్రకారం పాటించే పవిత్రమైన ధనుర్మాస కాలంలో, రోజువారీ సుప్రభాతానికి బదులుగా ఆండాళ్ తిరుప్పావై పారాయణం ఆనవాయితీగా వస్తోంది. .
డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు అర్చకులు, వేద పండితులు శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ శ్రీ ఆండాళ్ దేవి రచించిన 30 పాశురాలను పఠించారు. బుధవారంతో ధనుర్మాసం ముగియడంతో, గురువారం నుండి ఆలయం తన సాధారణ పూజా కార్యక్రమాలకు తిరిగి శ్రీకారం చుట్టిందని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సుప్రభాత సేవ తిరుమల ఆలయంలో మొదటి , అత్యంత ముఖ్యమైన రోజువారీ ఆచారం. ఇది గర్భగుడి లోపల ఉన్న శయన మండపంలో వేకువజామున నిర్వహిస్తారు, అక్కడ వేద మంత్రాలతో స్వామివారిని లాంఛనంగా మేల్కొలుపుతారు. ఈ పారాయణం బంగారు వాకిలి వద్ద ఆచార్య పురుషులు ఆలపించే కౌసల్యా సుప్రజా రామ అనే కీర్తనతో ప్రారంభమవుతుంది, అదే సమయంలో లోపలి ప్రాంగణంలో అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఆలపిస్తారు.
సుప్రభాతం స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం అనే నాలుగు భాగాలుగా ఉంటుంది, మొత్తం 70 శ్లోకాలు ఉంటాయి. దీనిని మానవాల మాముని శిష్యుడైన ప్రతివాది భయంకర అన్నన్ రచించారు. సేవ తర్వాత, వెండి విగ్రహమైన భోగ శ్రీనివాస మూర్తిని తిరిగి గర్భగుడిలోకి తీసుకు వెళతారు, ఆ తర్వాత ఆ రోజు మొదటి దర్శనం కోసం బంగారు వాకిలిని తెరుస్తారు. తిరుమల ఆరాధనలో సుప్రభాత సేవ అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటిగా పరిగణించ బడుతుందని అర్చకులు తెలిపారు.
