అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో అన్ని రంగాలు, వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించారంటూ ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకించి తన శాఖకు సంబంధించి రవాణా, రోడ్లు , భవనాలకు రూ. 9,856 కోట్లు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బీసీ జనార్దన్ రెడ్డి. గతంలో రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో ప్రజలంతా నరకయాతన అనుభవించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కేవలం 9 నెలల్లో రాష్ట్రాన్ని గుంతల రహితంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఒక్క ఏడాదిలో రహదారుల అభివృద్ధికి రూ. 3 వేల కోట్ల కేటాయింపులు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన రోడ్లను కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు బీసీ జనార్దన్ రెడ్డి.
పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1280 కోట్లు కేటాయించారని చెప్పారు మంత్రి. 20 నెలల పాలనలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనతో కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. ఇది రాష్ట్రానికి శుభ సూచకమని పేర్కొన్నారు .
నేడు చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మార బోతోందన్నారు. దేశంలో 25 వ వంతు జనాభా లేని ఆంధ్రప్రదేశ్ నేడు దేశంలో 25% పెట్టుబడులు సాధించడం చంద్రబాబు కృషికి నిదర్శనం అన్నారు. అభివృద్ధి , సంక్షేమాల కలబోతగా రూపొందించిడంతో బడ్జెట్ కేటాయింపుల్లో సమతుల్యత కనిపిస్తోందని అన్నారు. నిరుపేదలకు అండగా నిలిచేందుకు సంక్షేమ పథకాలకు 91 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. రాయలసీమను హార్టికల్చర్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రూ. 30 వేల కోట్లు కేటాయించడం సీమ సమగ్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
