నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అనంత‌పురం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు నీటి భ‌ద్ర‌త గురించి. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘#జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం అన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం అని అన్నారు సీఎం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగింద‌ని, నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద వ‌స్తుంద‌న్నారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిచ్చారు. నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టమ‌ని ప్ర‌క‌టించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పని చేస్తున్నాం అని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!