సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ పని చేస్తుంది
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. ఉద్యోగుల సమస్యలను సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం , కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఎల్లవేళలా తమ తలుపులు తెరిచి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకు వచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఎన్నికల షెడ్యుల్ కు 10 రోజులకు ముందు హడావిడిగా విలీనం అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా , కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఎడి సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు . కమిటీ ఏర్పాటు అయిన 10 రోజుల్లోనే అక్టోబర్ 10, 2023న ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నవంబర్ 30న ఎన్నికలు జరిగి, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 7, 2023న ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకొక ముందే , మార్చ్ 16, 2024న లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జూన్ 6 వరకు సుదీర్ఘంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని వివరించారు.
