నిర్మల్ జిల్లా : ప్రసిద్ద పుణ్య క్షేత్రం బాసర ఆలయ అభివృద్ది పనులు ఇక శరవేగంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ , జూపల్లి కృష్ణారావు, తదితరులతో కలిసి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని పునరుద్ధరించేందుకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం ఈ సందర్బంగా. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రూ. 225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువు లోగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలన్నారు సీఎం. నిధులు పుష్కలంగా ఉన్నాయని, రాబోయే గోదావరి పుష్కరాలకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం. అంతకు ముందు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీలు జి. నగేష్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బి. మహేష్ కుమార్ గౌడ్ , దండే విఠల్ , సి. అంజిరెడ్డి ఎమ్మెల్యేలు ఎ. మహేశ్వర్ రెడ్డి , రామారావు పటేల్ , వెడ్మ బొజ్జు , ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
