హైదరాబాద్ : 24 ఏళ్ల తర్వాత భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటి ప్రత్యూష కేసుపై. మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యూష కేసులో కీలక నిందితుడిగా ఉంటూ బెయిల్ పై బయట ఉన్న సిద్దార్థ్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. నాలుగు వారాల లోపు లొంగి పోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై తీవ్రంగా స్పందించారు నటి ప్రత్యూష తల్లి సరోజనీదేవి.
ఇదిలా ఉండగా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష తల్లి సరోజిని గత కొన్నేళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, సరోజిని స్పందిస్తూ, తన కుమార్తెకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుస్వామి కమిషన్ ప్రత్యూషను అత్యాచారం చేసి హత్య చేశారంటూ పేర్కొన్నదని అన్నారు. జీవిత ఖైదుకు బదులుగా సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష ప్రకటించిందని, ఈ శిక్ష ఏ మాత్రం సరిపోదని అన్నారు. గత 23 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నాను కానీ నా కుమార్తెకు న్యాయం జరగలేదంటూ వాపోయింది. నటి ప్రత్యూష ఫిబ్రవరి 23, 2002లో మరణించింది.
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా.. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని తాను అనుకోవడం లేదన్నారు సరోజనీదేవి. నా కూతురును చంపేశారు, సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేదన్నారు.
